సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం.. రాజకీయ విజయం మాత్రమే కాదని, ఒక నిబద్దత కలిగి.. ప్రజలకు అంకితమై.. ప్రజా జీవితంలో నైతిక విలువలను పాటిస్తూ.. ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ.. విలువలు కలిగిన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుని, నిర్ణయించిన విజయమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా సాధించటానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా తనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకున్నారని, ఎక్కడా హోదాను డిమాండ్ చేసిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో పలుసార్లు ఒత్తిడి తెచ్చినా స్పందించలేదన్నారు. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను వెనక్కి తీసుకోవాలని, కలిసి పోరాడదామని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత, వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన తర్వాత.. తప్పని పరిస్థితుల్లో టీడీపీ మంత్రులను కేంద్రంనుంచి వెనక్కు రప్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అన్ని సీజన్లలో 14నెలల పాటు చేసిన పాదయాత్ర హిస్టరీలో నిలిచిపోయే విధంగా జరిగిందని తెలిపారు. కోట్లాదిమంది ప్రజలను వైఎస్ జగన్ కలవటం ద్వారా ప్రజలకు ఆయనపై బరోసా కలిగిందని చెప్పారు. జనమే జగన్.. జగనే జనం అన్నట్లుగా మారిపోయిందని, దాని ఫలితంగానే ఈ ప్రభంజనంలాంటి విజయం దక్కిందని అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడు అవసరంలేదనే ఆయన్ని పక్కకు నెట్టారని తెలిపారు. ఎలాంటి నేతనైతే ప్రజలు కోరుకున్నారో అలాంటి నేత వైఎస్ జగన్కు పట్టంకట్టారని పేర్కొన్నారు.