టీడీపీ.. ఓ లిటిగెంట్‌ పార్టీ

2 Jun, 2020 04:06 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

చరిత్రహీనుడిగా మిగిలినా చంద్రబాబు కుట్రలు మానలేదు

న్యాయస్థానాలు, చట్టాలపై మా పార్టీకి పూర్తి నమ్మకం ఉంది 

సీఎం జగన్‌ ఏడాది పాలనలో 3.58 కోట్ల మందికి నేరుగా లబ్ధి 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టు పక్షులుగా మారారని, టీడీపీ లిటిగెంట్‌ స్వభావం ఉన్న పార్టీ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కుయుక్తులతో ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను పేదలకు ఇస్తున్నా పిటిషన్లు వేస్తున్నారని దుయ్యబట్టారు. చరిత్రహీనుడిగా మారినా చంద్రబాబు కుట్రలు మానలేదన్నారు. బాధ్యత కలిగిన  ప్రతిపక్షమైతే ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ ఏడాది పాలనలో 3.58 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని, దాదాపు 90 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

► స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన నిమ్మగడ్డ రమేష్‌.. వాయిదా వేసేటప్పుడు ఎందుకు సంప్రదించలేదు? లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్యాక్షనిస్టు అన్నట్టుగా ఎందుకు రాయాల్సి వచ్చింది? ఏజీ మాట్లాడితే నిమ్మగడ్డ కంటే ముందుగా యనమల స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది?
టీడీపీ హయాంలో కేబినెట్‌ సమావేశాలన్నీ టెండర్లు ఖరారు చేయడం, బ్యాంకు గ్యారెంటీలకే సరిపోయాయి. 
► రివర్స్‌ టెండర్ల ద్వారా మేం రూ.రెండు వేల కోట్లు ఆదా చేయడం బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కనిపించదా?
► మా పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు 2014 – 2019 మధ్య గత ప్రభుత్వం బనాయించిన కేసులతో నలిగిపోయారు. వారికి అండగా ఉంటాం.  
► రోడ్డు మీద తప్ప తాగి ప్రభుత్వాధినేతను దూషిస్తున్న వారి తరçఫున కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. 
► టీడీపీ అధికారంలో ఉండగా సీఎం జగన్‌ కుటుంబ సభ్యులను చెప్పలేని విధంగా దూషించి దుష్ప్రచారం చేశారు. అయినా ఆయన సహించారు.
► గత పది రోజులుగా> జరుగుతున్నవి గమనిస్తే కార్య నిర్వాహక వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఏదో జరుగుతున్నట్లుగా టీడీపీ సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కోర్టులు, ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌కి సంబంధించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాం.
► సీఎం వైఎస్‌ జగన్‌ ఏ రోజైనా సిస్టమ్స్‌పై ఒక్క మాటైనా అన్నారా? ఎప్పుడైనా మాట తూలారా? తాను చెప్పనివి కూడా అమలు చేసి తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. 
► కోర్టులు, చట్టాలంటే మాకు అపార గౌరవం. మేమెప్పుడూ కోర్టులపై కామెంట్‌ చేయలేదు. 

మరిన్ని వార్తలు