‘వైఎస్సార్‌సీపీకి 130 సీట్లు వస్తాయి’

27 Jan, 2019 20:42 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం డక్కలిలో జరిగిన వైఎస్సార్‌ సీపీ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలల కాలం పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే వైఎస్సార్‌ సీపీదే విజయమని తెలిపారు.

చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో తప్ప మిగిలిన అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని సజ్జల గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని అన్నారు. పోలవరం అక్రమాలపై కేంద్రం విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌, పార్టీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిలతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు