'కాంగ్రెస్‌కు బ్రేకులు వేస్తున్నాం'

13 Oct, 2019 07:07 IST|Sakshi

జగదీశ్‌రెడ్డి

సాక్షి, సూర్యాపేట : ‘హూజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు బ్రేక్‌లు వేస్తున్నాం. 2018 ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ గెలుపునకు దగ్గరగా వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కూడా కేసీఆర్‌ వెంటనే నడవాలని నాడు ఫలితాలు వచ్చాయి. మా పార్టీ గుర్తుకు సమీపంలో ఉండే గుర్తుతో అభ్యర్థిని బరిలోకి దింపి నాడు ఉత్తమ్‌ గెలిచాడు. అప్పుడు సీఎం అయితానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో ప్రజలు కొంత టర్న్‌ అయ్యారు. గుర్తుల కన్‌ఫ్యూషన్‌ కొంత దెబ్బతీసింది. టెక్నికల్‌గా గెలిచాడు తప్పా.. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి కేంద్ర మంత్రిని అవుతానని చెప్పి ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు ఆయన ప్రజలను మోసగించడానికి ఏమీ లేవు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి విజయం ఖాయం’ అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. 

నియోజకవర్గ అభివృద్ధిని ఉత్తమ్‌ కోరలేదు.. 
ఉత్తమ్‌ గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు ఏ పనులు చేయకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఆరేళ్లలో ఏ ఒక్క రోజు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించలేదు. హుజూర్‌నగర్‌లో ఈ సమస్య ఉంది.. పరిష్కారం చేయండని ముఖ్యమంత్రికి ఏనాడూ విజ్ఞాపన పత్రం ఇవ్వలేదు. జిల్లా మంత్రిగా నా దృష్టికి తీసుకురాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏనాడు జెడ్పీ సమావేశాలు, అధికారుల సమీక్షలకు హాజరుకాలేదు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు శ్రద్ధ లేదు. ప్రజలంటే ఆయనకు నిర్లక్ష్యం. ఇవన్నీ ప్రజల్లో చర్చ జరుగుతుంది.

అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఎమ్మార్వో ఆఫీస్‌ ముందు ధర్నా చేశారు. అభివృద్ధి జరగలేదని అతను ఒప్పుకుంటే అతనే చేయలేదన్న భావన ప్రజలకు చెప్పనట్లయింది. ఇవన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి. సైదిరెడ్డి పుట్టింది.. పెరిగింది హుజూర్‌నగర్‌ నియోజవర్గంలోనే. వాళ్ల ఊరికి వాళ్ల నాన్న, అమ్మ సర్పంచ్‌గా చేశారన్నది అందరికి తెలుసు. వాళ్ల నాన్న పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. దీనిపై ఉత్తమ్‌ పొరపాటున మాట్లాడి నాలుక కరుచుకున్నాడు. సైదిరెడ్డిది ఏ ఊరంటే మఠంపల్లి మండలం గుండ్లపల్లి అన్ని ఎవరైనా చెబుతారు. అదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిలది ఏ ఊరు అం టే చెప్పగలిగిన వారు వేళ్లమీద లెక్కపెట్టే వారు లేరు. ఇప్పుడు సైదిరెడ్డి రెండోసారి బరిలోకి దిగడంతో ఉత్తమ్‌కు నిద్ర పట్టడం లేదు. 

మేం బలోపేతమయ్యాం..
2018 ముందు మాకు బూత్‌ స్థాయిలో పటిష్ట యంత్రాంగం లేదు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వా త జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము హుజూర్‌నగర్‌లో మెజార్టీ స్థానాలు సాధించుకున్నాం. 143 సర్పంచ్‌ల్లో 100 పైగా సర్పంచ్‌ల్లో మేమే ఉన్నాం. మెజార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు మేమే. బూత్‌ కమిటీలతో సహా నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఉత్తమ్‌ ఏదో రెండు రోజుల ముందు జిమ్మిక్కులు చేస్తాడన్నది ఇప్పుడు పారవు. కాంగ్రెస్‌ పార్టీ కన్నా సంస్థాగత నిర్మాణంలో మేమే బలంగా ఉన్నాం. బూత్‌ల దగ్గర ఉత్తమ్‌ ఆటలు సాగవు.

బీజేపీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోజు మాట్లాడుకుంటున్నారు. మా అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో బలంగా ఉంది. చంద్రబాబు పాలనలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కిం ద వరుసగా ఏడేళ్లు ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టినా ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు వరి నాట్లు వేస్తే దాన్ని రక్షించడానికి డెడ్‌ స్టోరేజీలో కూడా నీళ్లను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల పంటను కాపాడాం. రైతులు ఈ మార్పును స్పష్టంగా గమనించారు. 

సైదిరెడ్డి నిత్యం ప్రజల్లో ఉన్నారు..
హుజూర్‌నగర్‌ చైతన్యవంతమైన ప్రాంతం. ఉత్తమ్‌ గతంలో వరుసగా గెలుస్తుండడానికి ప్రధాన కారణం ఉంది. అక్కడ ఒక్కసారి పోటీ చేసిన వారు రెండోసారి పోటీ చేయలేదు. సైదిరెడ్డి.. ఇప్పుడు రెండోసారి పోటీలో ఉన్నారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాత సైదిరెడ్డి నిత్యం కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండి ఒక్కో గ్రామాన్ని ఐదారుసార్లు సందర్శించారు. స మస్యలను మంత్రిగా నాదృష్టికి, సీఎం దృష్టికి తీసుకొచ్చి పరిష్కా రానికి కృషిచేశారు. ఈ మార్పు ను ప్రజలు గమనిస్తున్నారు.  

మరిన్ని వార్తలు