నాకు ఓటేయకపోతే శపిస్తా : బీజేపీ ఎంపీ

13 Apr, 2019 10:04 IST|Sakshi

ఉన్నావ్‌ : 2019లో 'మోదీ సునామీ'  నేపథ్యంలో 2024లో ఎన్నికలే జరగవని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్‌.. తాజాగా ఓటర్లను బెదరించారు. తనకు ఓటేయ్యకపోతే శపిస్తానని హెచ్చరించారు. ఉన్నావ్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సాక్షిమహరాజ్‌.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరించారు. తాను ఒక సన్యాసినని, సన్యాసి అడిగింది ఇవ్వకపోతే.. చెడు కలుగుతుందని పురాణాల్లో ఉందన్నారు. సుఖాలకు దూరమై చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నారు. తానేం ఆస్తులు అడుగటం లేదని, 125 కోట్ల మంది భవిష్యత్తు నిర్ణయించే ఓటును మాత్రమే అడుగుతున్నాన్నారు.

కేంద్రమంత్రి మనేకాగాంధీ సైతం ఇలానే ఓటర్లను బెదిరించి అభాసుపాలైనవ విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న ఆమె.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం ఓటర్లను బెదరించారు. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషాన్నివ్వదని, తనకు ఓటు వేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు.  ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ.. వారికందే సహాయం ఓటేసేదానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేయడంతో ఈసీ ఆమెను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు