ఆరెస్సెస్ ఆర్మీ స్కూల్ ప్రతిపాదనపై ఎస్పీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో వచ్చే సంవత్సరం ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ లబ్ధి కోసమే ఆరెస్సెస్ ఆర్మీ పాఠశాలను ఏర్పాటు చేయాలనుకుంటుందని, ఆ పాఠశాలలో సామరస్యాన్ని దెబ్బతీయడం, మూక దాడులు చేయడమే నేర్పిస్తుందని దుయ్యబట్టింది.
ఆరెస్సెస్ సమాజాన్ని విభజించే భావజాలాన్ని అనుసరిస్తోందని, స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదని, ఇప్పటికీ కూడా స్వాతంత్ర్య పోరాట ఆశయాలను ఆ సంస్థ పట్టించుకోవడం లేదని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరెస్సెస్ ఆర్మీ స్కూల్ ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తోందని, జాతీయస్థాయిలో కుట్రగా ఇది కనిపిస్తోందని, ఇది రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని ఎస్పీ ధ్వజమెత్తింది. యూపీ బులంద్షహర్ జిల్లాలోని శిఖర్పూర్లో ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలని ఆరెస్సెస్ భావిస్తోందని, ‘సైనిక్’ స్కూల్ తరహాలో ఈ పాఠశాలలో పిల్లలకు భారత సైన్యానికి పనికొచ్చేవిధంగా శిక్షణ ఇవ్వనున్నారని, దీంతోపాటు సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో బోధన ఉంటుందని కథనాలు వచ్చాయి.