వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత

8 May, 2019 10:53 IST|Sakshi

లక్నో : కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్‌ నిరుపమ్‌.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని నయా ఔరంగజేబుగా వర్ణించారు. వారణాసిలో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్‌ నిరుపమ్‌. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘వారణాసి ప్రజలు ఎన్నుకున్న నరేంద్ర మోదీని చూస్తే.. నాకు నయా ఔరంగబేబులా కనిపిస్తున్నారు. నేను ఆయనను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఔరంగజేబు కూడా చేయని ఎన్నో అకృత్యాలను మోదీ చేస్తున్నార’ని మండిపడ్డారు.

అంతేకాక కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని అనేక ఆలయాలను కూలదోశారని సంజయ్‌ నిరుపమ్‌ ఆరోపించారు. మోదీ సూచనల మేరకే వాటిని కూలదోశారని ఆయన పేర్కొన్నారు. మోదీ తీసుకొచ్చిన నియమాల వల్లే కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం కోసం జనాలు రూ. 550 చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శించారు. 17వ శతాబ్దానికి చెందిన ఔరంగజేబు ఎన్నో హిందూ ఆలయాలను కూల్చి చరిత్రపుటల్లో హిందూ వ్యతిరేకిగా మిగిలాడు. అలాంటి వ్యక్తితో.. నరేంద్ర మోదీని పోల్చడంతో.. బీజేపీ నాయకులు సంజయ్‌ నిరుపమ్‌ మీద మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు