అలాంటి పనులు మహారాష్ట్రకు ద్రోహం చేయడమే!

2 Dec, 2019 14:14 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే చేసిన సంచలన వ్యాఖ్యలపై సంజయ్‌రౌత్‌ స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని.. '80 గంటలు ముఖ్యమంత్రిగా ఉండి.. మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించారని అనంతకుమార్‌ హెగ్డే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయడం అనేది మహారాష్ట్రకు ద్రోహం  చేయడమే అవుతుంది' అంటూ సంజయ్‌రౌత్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై ఇప్పడు పెద్ద దుమారమే రేగుతోంది.

ఇదిలా ఉంటే ఆదివారం రోజున అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యాయని తమకు తెలిసిన వెంటనే అప్పటికే రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.40 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని, వాటిని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఫడ్నవీస్‌తో హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ నిధులను తిరిగి కేంద్రానికి బదలాయించారని వ్యాఖ్యానించారు.

చదవండి: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం పెద్ద డ్రామా..!

మరిన్ని వార్తలు