సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి భంగపాటు ఎదురైంది. మంత్రి సోమిరెడ్డికి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. వరుసగా అయిదోసారి ఆయన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా మూడు ఎన్నికల్లో ఓటమి వచ్చినా, సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలోనే అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే.
1999 తరువాత ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని నమోదు చేయలేకపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఐదోసారి కూడా సోమిరెడ్డికి నిరాశే మిగిలింది. సర్వేపల్లి నుంచి 2004, 2009, 2014లో పోటీ చేసి ఓడిన సోమిరెడ్డి, 2012 ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఓటమి చెందినప్పటికి సోమిరెడ్డి... బాబు వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీ తీసుకొని కేబినెట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి మరీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న సోమిరెడ్డికి ఈసారి కూడా ఓటర్లు తమదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో ఇక సోమిరెడ్డి రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.