చినబాబు లెక్కలు.. బుస్‌.. బుస్‌... బోగస్‌

8 Dec, 2017 13:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎవరూ అడగటం లేదు.. ప్రకటన చేశాక ఎవరూ పట్టించుకోరు... అయినాగానీ ఆస్తుల ప్రకటన పేరిట నారా వారి ఫ్యామిలీ చేసే డ్రామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఈ ఏడాదికిగానూ నారా లోకేష్‌ ఆస్తుల వివరాలను వెల్లడించగా.. ఆ ప్రకటన ఎంత చిత్ర-విచిత్రంగా ఉన్నాయో ఓసారి చూద్దాం. 

వేల కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను వందల కోట్ల లోపే చూపిస్తూ.. పైగా మార్కెట్‌ విలువ అంటూ కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చినబాబు బాగానే చేశాడు. జూబ్లీహిల్స్‌ లో వందలకోట్ల విలువైన ఇంటి గురించి మాట మాత్రం ప్రస్తావించని లోకేష్‌.. మదీనా గూడలోని కొన్ని వందల కోట్లు విలువ చేసే పదెకరాల భూమి విలువను కేవలం 73 లక్షల రూపాయలుగా చూపించటం గమనార్హం. ఇక  ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా 300 కోట్ల రూపాయాల ఆస్తులను చూపించిన లోకేష్‌ ఇప్పుడు కేవలం 15 కోట్ల రూపాయిలు అని చెప్పటం ఆశ్చర్యకరమే. 

తల్లి భువనేశ్వరి పేరు మీద ఉన్న పంజాగుట్టలో ఉన్న ఇల్లు, తమిళనాడులోని కోట్ల విలువైన భవనాలు, భూముల ప్రస్తావన మచ్చుకైనా కనిపించలేదు. భార్య బ్రాహ్మిణి పేరు మీద జూబ్లీహిల్స్‌, మణికొండ, చెన్నైలో ఉన్న వందల కోట్ల ఫ్లాట్లు, ఫ్లాట్ల విలువ కూడా తప్పుడు లెక్కలతోనే కూడికుని ఉంది. ఇక తనయుడు మూడేళ్ల దేవాన్ష్‌ ఆస్తి రూ.11.54 కోట్లుగా పేర్కొన్నాడు. వీటన్నింటిని మించి నారా చంద్రబాబు నాయుడు నికర ఆస్తి రూ.2.53 కోట్లు అని ప్రకటించి తమ ఇంట్లో అత్యంత పేద వ్యక్తి తన తండ్రేనని ప్రకటించి సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాడు. 

ముందు హామీలను నెరవేర్చండి : ఎంపీ మిథున్‌రెడ్డి

చిత్తూరు : నారా లోకేష్‌ ఆస్తుల ప్రకటనపై వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు. ‘ఆస్తుల వివరాలు ఎవరూ అడగటం లేదు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అన్నింటికి మించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యండి’ అని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు