-

అభ్యర్థిపై హీరో ట్వీట్ : చాలా లేటైంది బాస్‌!

19 May, 2019 15:23 IST|Sakshi

ముంబై: మహాత్మాగాంధీ హంతకుడైన నాథురాం గాడ్సేను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసిన భోపాల్‌ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అఖ్తర్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించిన సాధ్వికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన భోపాల్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ప్రియమైన భోపాల్‌ ఓటర్‌లారా.. మరో గ్యాస్‌ ట్రాజెడీ నుంచి మీ నగరాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రగ్యాకు నో చెప్పండి. గాడ్సేకు నో చెప్పండి. మహాత్ముడిని గుర్తుచేసుకోండి. ద్వేషాన్ని కాదు ప్రేమను ఎంచుకోండి’ అంటూ ఆయన పేర్కొన్నారు. 

అయితే, భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటికే పోలింగ్‌ ముగిసింది. ఆరో దఫా ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న భోపాల్‌లో జరిగిన పోలింగ్‌లో నిజానికి రికార్డుస్థాయిలో 65.69శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత తీరిగ్గా ప్రగ్యాకు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసిన ఫర్హాన్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పడే ట్వీట్‌ చేయడం.. చాలా తొందరపడటం అవుతుందని ఓ నెటిజన్‌ చమత్కరించగా.. మీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను మార్చుకోండి.. మీ ట్వీట్‌ పోస్టు అవ్వడానికి పదిరోజుల సమయం తీసుకుంటోందని మరొకరు కామెంట్‌ చేశారు. భోపాల్‌లో బీజేపీ నుంచి సాధ్వి బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌సింగ్‌ పోటీ చేస్తుండటంతో ఇక్కడ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది.
 

మరిన్ని వార్తలు