‘రాజీనామాలపై తేల్చేందుకు మరికొంత సమయం’

11 Jul, 2019 17:27 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటక విధానసౌధ వద్ద హైడ్రామా నెలకొంది. రాజీనామా చేసిన పదిమంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం స్పీకర్‌ సురేష్‌ కుమార్‌ను కలుసుకున్నారు. స్పీకర్‌కు రాజీనామాలపై వారు వివరణ ఇచ్చారు. ముంబై హోటల్‌లో బస చేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూర్‌ చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం స్పీకర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అసంతృప్త ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా అనేది వారిని కలిసి స్వయంగా చర్చించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు.

స్పీకర్‌ అప్పీల్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలవాలని, అర్ధరాత్రిలోగా రాజీనామాలపై స్పీకర్‌ తన నిర్ణయం వెల్లడించాలని అంతకుముందు సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.స్పీకర్‌ తమ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొంటూ ముంబై హోటల్‌లో బసచేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు