ఆమరణ దీక్షకు దిగుతా: కేజ్రీవాల్‌

10 Mar, 2018 18:07 IST|Sakshi
అరవింద్‌ కేజ్రీవాల్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 31లోపు సీలింగ్ డ్రైవ్(షాపుల మూసివేత) నిలిపివేయకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించారు. 

నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణ సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్‌ చేస్తున్నారు. వ్యాపారులకు మద్ధతుగా నిలిచిన క్రేజీవాల్‌ అవసరమైతే వారి తరపున పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ‘వ్యాపారులు నిజాయితీగానే పన్నులు కడుతున్నారు. సీలింగ్‌ డ్రైవ్‌ వల్ల వేలాది మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడతారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంద’ని ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో చట్టం చేయడం ఒక్కటే సీలింగ్‌ డ్రైవ్‌కు పరిష్కారమని కేజ్రీవాల్‌ సూచించారు. 

కేంద్రం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ... ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కేజ్రీవాల్‌ లేఖ రాశారు. చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా పార్లమెంట్‌లో బిల్లు చేసి సీలింగ్‌ డ్రైవ్‌ ఆపేలా చొరవ చూపాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు