రెండో అత్యంత ధనికుడు కొండా

14 May, 2019 01:39 IST|Sakshi

తొలిస్థానంలో బిహార్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఆర్కే శర్మ

అత్యధిక ఆదాయం ఉన్న ముగ్గురూ తెలుగువారే

గల్లా జయదేవ్, బీద మస్తాన్‌రావు, గడ్డం రంజిత్‌రెడ్డి

ఏడు విడతల అభ్యర్థుల వివరాలపై నివేదిక వెల్లడించిన ఏడీఆర్‌  

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బిహార్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఆర్‌.కె.శర్మ నిలవగా.. రెండో అత్యంత ధనికుడిగా చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిలిచారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్‌రెడ్డి దేశంలో అత్యధిక వార్షిక ఆదాయం పొందుతున్న వారిలో మూడో వ్యక్తిగా నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా లోక్‌సభ బరిలో నిలిచిన 8,049 అభ్యర్థుల నుంచి 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫారŠమ్స్‌ (ఏడీఆర్‌) సంస్థలు ఈమేరకు సోమవారం ఒక నివేదిక వెల్లడించాయి. 

నేరచరితలోనూ తక్కువేంకాదు.. 
- 19 శాతం (1,500) మంది అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉన్నారు. 2014లో ఈ సంఖ్య 1,404 (17 శాతం)గా ఉంది. 2009లో ఇది 1,158 (15 శాతం). 
13 శాతం (1,070) మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాభియోగాలు కలిగి ఉన్నారు. రేప్, హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు తదితర తీవ్రమైన కేసులు ఉన్నవారి సంఖ్య 2014లో 11 శాతంగా, 2009లో 8 శాతంగా ఉంది.  
56 మంది అభ్యర్థులు తమకు కేసుల్లో శిక్షపడినట్టుగా వెల్లడించారు. 
55 మంది అభ్యర్థులపై హత్య సంబంధిత కేసులు నమోదై ఉన్నాయి. 184 మందిపై హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. 
126 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయి. 
- 47 మందిపై కిడ్నాప్‌ కేసులున్నాయి. 
95 మంది విద్వేష ప్రసంగాలతో (హేట్‌ స్పీచ్‌) కేసులు నమోదైన వారు ఉన్నారు. 
బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం (175 మంది), కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 39 శాతం (164), బీఎస్పీ అభ్యర్థుల్లో 22 శాతం (85), సీపీఐ(ఎం) అభ్యర్థుల్లో 58 శాతం (40 మంది), స్వతంత్రుల్లో 12 శాతం అభ్యర్థులపై కేసులు నమోదై ఉన్నాయి. 
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే డామన్‌ అండ్‌ డయ్యూలో అత్యధికంగా 50 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదవగా.. అత్యల్పంగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 7 శాతం అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదైన అభ్యర్థులు ఉన్న రాష్ట్రాల్లో తదుపరి స్థానాల్లో దాద్రానగేర్‌ హవేలీ (36 శాతం), లక్షద్వీప్‌ (33 శా తం), కేరళ (32శాతం), బిహార్‌ (26 శాతం), మహారాష్ట్ర (26 శాతం), గోవా (25 శాతం), యూపీ (23 శాతం), జార్ఖండ్‌ (23 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (21 శాతం) నిలిచాయి. తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 12 శాతం అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి.  

ఆర్థిక స్థితిగతులు ఇలా... 
లోక్‌సభకు పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 2009లో 16 శాతం కోటీశ్వరులు ఉండగా, 2014లో ఆ సంఖ్య 27 శాతానికి పెరిగింది. 2019లో ఆ సంఖ్య 29 శాతానికి పెరిగింది.  
రాష్ట్రాల వారీగా చూస్తే అరుణాచల్‌ప్రదేశ్‌లో 83 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. మేఘాలయ (78 శాతం), మిజోరం (67 శాతం), నాగాలాండ్, డామన్‌ అండ్‌ డయ్యూ, లక్షద్వీప్, గోవాల్లో 50 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. జమ్మూకశ్మీర్‌లో 48 శాతం, హిమాచల్‌లో 47 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. చివరి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇక్కడ 18 శాతం మంది మాత్రమే కోటీశ్వరులు. 
2019 లోక్‌సభ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 4.14 కోట్లు. 
పార్టీలవారీగా అభ్యర్థుల  ఆస్తులు చూస్తే బీజేపీ అభ్యర్థు ల సగటు ఆస్తి రూ. 13.37 కోట్లు గా ఉంది. కాం గ్రెస్‌ అభ్యర్థుల సగటు రూ. 19.92 కోట్లుగా, బీఎస్పీ సగటు రూ. 3.86 కోట్లుగా ఉంది. సీపీఎం రూ. 1.28 కోట్లుగా, స్వతంత్రుల సగటు రూ. 1.25 కోట్లుగా ఉంది. 
2019 అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులు కలిగిన తొలి మూడు స్థానాల్లో బిహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రమేష్‌కుమార్‌ శర్మ రూ. 1,107 కోట్ల ఆస్తులతో తొలిస్థానంలో నిలిచారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి lokరూ.895 కోట్ల ఆస్తులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నకుల్‌నాథ్‌ రూ. 660 కోట్లతో మూడోస్థానంలో నిలిచారు. 
60 మంది అభ్యర్థులు తమకు ఆస్తులేమీ లేవని ప్రకటించారు. 
756 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. లక్ష లోపు ఉన్నాయి. అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన వారిలో కింది నుంచి తమిళనాడులోని మాయిలాదుతురై నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రాజేశ్, రాజా తమ ఆస్తులను రూ. 100లుగా చూపగా, కేరళలోని వయనాడ్‌ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసిన శ్రీజిత్‌ రూ. 120గా చూపారు.  
మొత్తం అభ్యర్థుల్లో 10 శాతం మంది తమ పాన్‌ కార్డు వివరాలు వెల్లడించలేదు.

విద్యార్హతలు.. 
44 శాతం అభ్యర్థుల విద్యార్హత ఐదో తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉండగా.. 48 శాతం మంది అభ్యర్థులు పట్టుభద్రులు, ఆపై అర్హతగా కలిగి ఉన్నారు. 253 మంది అభ్యర్థులు తాము అక్షరాస్యులమని ప్రకటించగా, 163 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులమని ప్రకటించారు.

టాప్‌–3 తెలుగువారే 
అత్యధిక వార్షిక ఆదాయం (ఇన్‌కంటాక్స్‌ రిటర్న్‌ల్లో చూపిన మేరకు) ప్రకటించిన వారిలో తొలి ముగ్గురు తెలుగువారే. టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, బీద మస్తాన్‌రావు వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో నిలవగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. భార్య, పిల్లల వార్షికాదాయంతో కలిపి గల్లా జయదేవ్‌ రూ.43 కోట్లు, బీద మస్తాన్‌రావు రూ. 34 కోట్లు, రంజిత్‌రెడ్డి రూ. 33 కోట్లుగా చూపారు. 

మరిన్ని వార్తలు