కర్ణాటక సెంటిమెంటే గెలిచింది

15 May, 2018 13:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీని మరో ఎన్నికల్లో మట్టి కరిపించడం కర్ణాటక ప్రజల సంప్రదాయం. వారి సెంటిమెంట్‌. గత 30 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిలబెట్టుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాల తీరు సూచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టంగట్టిన ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడుతున్నారు. బలమైన వారి సంప్రదాయం ముందు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొత్త ఎన్నికల ఎత్తులు కూడా చిత్తయ్యాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ విస్తతంగా ప్రచారం చేయడంతోపాటు తన వైఖరికి భిన్నంగా గుళ్లూ గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు తిరిగారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ద్వారా నాయకత్వ పరిణితి పొందిన రాహుల్‌ గాంధీ కర్ణాటక ఎన్నికల్లో మరింత నాయకత్వ పరిణితితో వ్యవహరించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా చూశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మాట తీరును మార్చుకున్నారు. మాటను మాటతోనే తిప్పి కొట్టడమూ నేర్చుకున్నారు. గుజరాత్‌తో అతి తక్కుమ మెజారిటీ విజయం సాధించిన బీజేపీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఓటమి తప్పకపోవచ్చని, జోరు మీదున్న రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించారు.

ఇక సిద్ధరామయ్య బీజేపీకి బలమైన లింగాయత్‌లను పార్టీకి దూరం చేసేందుకు కృషి చేశారు. వారిని ప్రత్యేక మైనారిటీ మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు. ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, ఇతర ఓబీసీ వర్గాల సమీకరణ కు ‘అహిందా’ దక్పథాన్ని అనుసరించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతూ చారిత్రక అంశాలను తప్పుగా ప్రచారం చేసిన ప్రజలు ఆయన్నే నమ్మారు. హంగ్‌ తప్పదంటూ చెప్పిన ప్రీ పోల్, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలను కూడా తలకిందులు చేస్తూ ప్రజలు తమ సెంటిమెంట్‌కు ఓటేశారు. మరోసారి పాలకపక్షాన్ని ఓడించారు.

మరిన్ని వార్తలు