శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాగం!

8 Sep, 2018 09:37 IST|Sakshi

జగదీశ్వర్‌గౌడ్‌కు టికెట్‌ ఇవ్వకుంటే ప్రగతి భవన్‌ ముట్టడిస్తాం

కార్పొరేటర్‌ అభిమానుల హెచ్చరిక

మియాపూర్‌: మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌కు శేరిలింగంపల్లి టికెట్‌ ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని డివిజన్‌ కార్యకర్తలు, అభిమానులు హెచ్చరించారు. శుక్రవారం హఫీజ్‌పేట్‌ డివిజన్‌లోని ఇంజినీర్స్‌ ఎన్‌క్లేవ్‌ కమ్యూనిటీ హాల్‌లో కార్యకర్తలు పలువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న బీసీ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్‌కు వారం రోజుల్లోగా శేరిలింగంపల్లి టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో 10 డివిజన్లలోని నాయకులు, కార్యకర్తలను ఏకం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ అధిష్టానం తలొగ్గకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తేల్చిచెప్పారు.

అయినా పార్టీ విధానంలో మార్పు రాకపోతే తమ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలిపారు. ఆయన గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని విధాలా అర్హుడైన జగదీశ్వర్‌గౌడ్‌ను కాదని టీడీపీ నుంచి వచ్చిన ఆరెకపూడి గాం«ధీకి టికెట్‌ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు నల్లా సంజీవరెడ్డి, తయార్‌ హుస్సేన్, నాగేశ్వర్‌రావు, మోహన్‌ నాయక్, జీవీ రెడ్డి, లక్ష్మీనారాయణ, దేవేందర్, సాదిక్, సయ్యద్‌ సత్తార్‌ హుస్సేన్, శ్రీనివాస్‌ గౌడ్, లక్ష్మణ్, మోసిన్, అజీజ్, సాజిద్, భాగ్యారావు, శ్యామ్, కృష్ణ, రాధారాణి, సరోజ, దేవి, బిందు, రత్నమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు