ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకో..

6 Jul, 2019 13:28 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ

ప్రజల సమస్యలు వినేందుకు దర్బార్‌ పెడుతుండు

కేసీఆర్‌ మాత్రం ఎవరినీ పట్టించుకుంటలేడు

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ

సాక్షి, కామారెడ్డి: పక్క రాష్ట్రం ఏపీలో సీఎం జగన్‌ దర్బార్‌ పెడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే మన సీఎంకు మాత్రం ప్రజల సమస్యలు వినే ఓపిక లేదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పాలనపై ఆయన పోలుస్తూ జగన్‌ను చూసి నేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 

2018 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ఇప్పటికీ రుణమాఫీ ఊసెత్తకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రుణమాఫీ జరకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రైతులు, కార్మికులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురుపోసుకుంటోందని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మిగులు బడ్జెట్‌ ఉంటే సీఎంగా కేసీఆర్‌ వచ్చిన తరువాత అప్పుల కుప్ప పెరిగిపోయిందని విమర్శించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఎక్కడా తాగునీరు రావడం లేదన్నారు. కామారెడ్డిలో భూఆక్రమణలు పెరిగిపోయాయని, రోడ్లపైనే అక్రమంగా పెద్దపెద్ద భవనాలు నిర్మించినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దేశరక్షణ కోసం పనిచేస్తున్న సైనికుడి కుటుంబ భూమికే రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరానని తెలిపారు. త్వరలో జరుగనున్న కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని షబ్బీర్‌అలీ దీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌లో విజయం సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, 49 వార్డులకు కమిటీలను వేసేందుకు గాను తొమ్మిది మందితో కమిటీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌రావ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉందని తెలిపారు. మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఫిరంగి రాజేశ్వర్, గోనె శ్రీను, కారంగుల అశోక్‌రెడ్డి, గంగాధర్, కన్నయ్య, రవి, చాట్ల రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి ఈ నెల 8న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలోని తన నివాసగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి  రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంభానికి అందాయన్నారు. ఆయన సేవలను ప్రజలెన్నటికీ మరిచిపోరన్నారు. వైఎస్సార్‌ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ శ్రేణులను ఆయన కోరారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నేతలు మదన్‌మోహన్‌రావ్, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, ఫిరంగి రాజేశ్వర్‌ తదితరులున్నారు.      

మరిన్ని వార్తలు