‘బాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌’

26 Oct, 2019 18:06 IST|Sakshi

సాక్షి, అనంతపురం: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అదే పనిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే ఇసుక సరఫరా చేస్తోందని మంత్రి తెలిపారు. కానీ, ముఖ్యమంత్రి జగన్‌ను పవన్‌, చంద్రబాబు కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు, పవన్‌ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. అనంతపురం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడారు.

ఐదేళ్ల పాలనా కాలంలో ఇసుక మాఫియా ద్వారా వందల కోట్లు సంపాదించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అందుకనే సీఎం జగన్‌పై పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఖజానాను చంద్రబాబు ఖాళీ చేశారని, అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బాబుదేనని అన్నారు. ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు