చైనాపై మోదీ ట్వీట్; ‘ప్రధాని సమాధానం చెప్పాల్సిందే’

7 Jul, 2020 21:03 IST|Sakshi

న్యూఢిల్లీ : గతంలో చైనాపై మోదీ చేసిన ట్వీట్‌ను గుర్తు చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు శశిథరూర్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పటి కేంద్రాన్ని ఉద్ధేశిస్తూ మోదీ స్వయంగా చేసిన తన ట్వీట్‌పై ప్రస్తుతం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  కాగా 2013లో చైనా-భారత్‌ బలగాలను ఉద్ధేశించి గుజరాజ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఓ ట్వీట్‌ చేశారు. ‘లడఖ్‌ నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ తమ సొంత భూభాగం నుంచి భారత బలగాలు ఎందుకు వైదొలుగుతున్నాయి. మనం ఎందుకు వెనక్కి తగ్గాము’. అని  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. (సీఎం నివాసాన్ని తాకిన క‌రోనా)

ఈ ట్వీట్‌ ప్రస్తుతం సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు దగ్గరగా ఉంది. గల్వన్‌ లోయ వద్ద పెట్రోలింగ్ పాయింట్స్ ప్రాంతంలో ఇరు దేశ సైన్యాలు తాత్కాలిక నిర్మాణాలు నిలిపివేసి, వెనక్కు వెళ్లేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు అధికార వర్గాలు ఆధివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల ముఖ్య నేతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు తమ బలగాలను వెనక్కి పిలిపించాయి. ఈ క్రమంలో ఒకప్పటి మోదీ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు చర్చకు దారీతీశారు. (‘ప్రభుత్వ అసమర్థతకు పోలీసులు బలి’)

కాంగ్రెస్ నేత శశి థరూర్.. నరేంద్ర మోదీ2013 ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ప్రధాని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలి’. అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో రణదీప్ సుర్జేవాలా కూడా స్పందించారు. ‘ప్రధాని.. మీ మాటలు మీకు గుర్తుందా? ఈ పదాలకు ఏమైనా విలువ ఉందా? భారత బలగాలు తమ భూభాగంలో ఎందుకు ఉపసంహరించుకుంటున్నాయో మీరు చెబుతారా? దేశం సమాధానం కోరుకుంటుంది’. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

మరిన్ని వార్తలు