‘వన్‌ మ్యాన్‌ షో.. టూ మ్యాన్‌ ఆర్మీ’

21 Sep, 2018 19:40 IST|Sakshi
శత్రుఘ్న సిన్హా(ఫైల్‌ ఫోటో)

మోదీ, షాలపై శత్రుఘ్న సిన్హా ఫైర్‌

అఖిలేష్‌ యాదవ్‌పై ప్రశంసల వర్షం

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ రెబల్‌ ఎంపీ శత్రుఘ్న సిన్హా సొంత పార్టీ నేతలపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈ సారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలను టార్గెట్‌ చేశారు. వారిద్దరి నాయకత్వాన్ని ‘‘వన్‌ మ్యాన్‌ షో.. టూ మ్యాన్‌ ఆర్మీ’’ అంటూ వ్యంగ్యాస్త్రలు వర్ణించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘వారిద్దరి నాయకత్వం అహంకారపూరితమైనది. వారికి అతి విశ్వాసం ఎక్కువ. ఈవీఎంలు వారి కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టే.. మరో 50 ఏళ్లు అధికారంలో ఉంటామని ముందుగా ప్రకటించారు’’ అని ట్వీట్‌ చేశారు.

అంతేకాకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆయన రెండు అడుగులు వెనక్కి వేసి మాయావతితో పొత్తు పెట్టుకున్నారని సిన్హా అభిప్రాయపడ్డారు. అఖిలేష్‌ రాజకీయాల్లో యువకుడైనా అద్భుతమైన విశ్వాసం, ధైర్యం, రాజకీయాల్లో పరిపక్వత కలిగిన నాయకుడని అభినందనలతో ముంచెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు దేశం కోసం ఓటు వేస్తారని సిన్హా పేర్కొన్నారు. కాగా గత కొంత కాలంగా అధికార పార్టీ నేతలపై సిన్హా తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. రాఫెల్‌ ఒప్పందంపై కూడా మోదీ ప్రభుత్వాన్ని ఆయన బహిరంగంగానే నిలిదీశారు.

>
మరిన్ని వార్తలు