టార్చిలైట్లు వేస్తే సమస్య పరిష్కారం కాదు

4 Apr, 2020 21:12 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. కోవిడ్‌ కట్టడికి తగినన్ని పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. చప్పట్లు కొట్టమని, టార్చిలైట్లు వెలిగించమని ప్రధాని పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘కోవిడ్‌-19 వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్‌లో తగినన్ని పరీక్షలు చేయడం లేదు. ప్రజలను చప్పట్లు కొట్టమని, టార్చిలైట్లు వేయమని పిలుపునిస్తున్నారు. టార్చిలైట్లు వేసి ఆకాశంలోకి చూపించినంత మాత్రాన పరిష్కారం లభించద’ని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. (ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ)

కరోనాపై పోరాటంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండదండలు అందించాలని కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనాటె డిమాండ్‌ చేశారు. మరింత ఆర్థిక సాయం, వనరులు అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనాపై పోరుకు వ్యూహాలు రచించేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పోరాడితే విజయం సులభమవుతుందన్నారు. రూ.42 వేల కోట్ల జీఎస్టీ బకాయిలను వెంటను విడుదల చేసి, కరోనాపై పోరుకు రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని అన్నారు. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?)

మరిన్ని వార్తలు