భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భోపాల్లో రాహుల్ గాంధీ రోడ్షో సందర్భంగా వెలిసిన పోస్టర్లపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్లో సోమవారం సాయంత్రం జరిగే పార్టీ కార్యకర్తల భేటీలో పాల్గొనేందుకు రాహుల్ నగరంలో 18 కిమీ మేర రోడ్షో నిర్వహించనున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతాల్లో రాహుల్ శివలింగంపై నీటిని పోస్తున్న భారీ కటౌట్లను పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.
రాహుల్ ఇటీవల చేపట్టిన మానససరోవర్ యాత్ర నేపథ్యంలో శివభక్తుడిగా కాంగ్రెస్ చీఫ్ను చిత్రీకరిస్తూ ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. రాహుల్తో పాటు పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల భారీ పోస్టర్లు, కటౌట్లను కూడా రోడ్షో జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. రాహుల్ రోడ్షోలో పార్టీ సీనియర్ నేత, మాజీసీఎం దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారు.