ముంబై: ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు.