ప్రభుత్వం ఏర్పడింది 80 రోజుల కోసం కాదు..

6 Dec, 2019 19:34 IST|Sakshi

ముంబై: మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం కేబినెట్‌ విస్తరణకు అన్ని చర్యలు తీసుకుంటోందని శివసేన పేర్కొంది. కేబినెట్‌ను ఏర్పాటు చేయడంలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత ఆశీష్‌ శెల్లర్‌ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం..కనీసం ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. అయితే ఆశీష్‌ వ్యాఖ్యలను శివసేన తిప్పికొట్టింది. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కేబినెట్‌ విస్తరణకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది. కేబినెట్‌ను ఎప్పుడూ విస్తరించాలో ప్రభుత్వానికి తెలుసునని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా కార్యకలాపాలను నిర్వహించే సత్తా ఉందని తెలిపింది.

మంత్రులకు శాఖలను కేటాయించనంత మాత్రాన వారికి ప్రాధాన్యత లేదనడం సరికాదని పేర్కొంది. నాగ్‌పూర్‌ సమావేశం చాలా ముఖ్యమని.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణపై ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం 80 రోజుల కోసం ఏర్పాటు చేసింది కాదని కచ్చితంగా ఐదు సంవత్సరాలు పాలిస్తుందని తెలిపింది. మరోవైపు ఉద్దవ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడింది.

మరిన్ని వార్తలు