ఎన్డీయే సమావేశానికి శివసేన దూరం

16 Nov, 2019 13:09 IST|Sakshi

 ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశం

సాక్షి, ముంబై: ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్షాలు ఆదివారం సమావేశం కానున్నాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, పలు కీలక బిల్లులపై ఈ సమావేశంలో చర్చించన్నారు. భేటీకి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి మొన్నటి వరకు ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఉన్న శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి హాజరయ్యేది లేదని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇదివరకు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీయే పక్షాలతో కలసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నందున శివసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే శనివారం మధ్యాహ్నాం లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరుగునున్న విషయం తెలిసింది. ఈ సమావేశానికి మాత్రం హాజరవుతామని ఆయన తెలిపారు. అనంతరం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే యూపీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో కూడా శివసేన పాల్గొనే అవకాశం ఉంది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీ విధించిన షరతు మేరకు కేంద్రమంత్రి పదవిలో ఉన్న అరవింద్‌ సావంత్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్డీయే నుంచి శివసేన బయటకు వచ్చినట్లు అయింది. అయితే శివసేన నేతలు అధికారం కోసం యూపీఏ కూటమిలో చేరారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు