బీజేపీకి శివసేన చురకలు..

18 Nov, 2019 14:53 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో భారతీయ జనతా పార్టీ విఫలమైన నేపథ్యంలో శివసేన రైతులపై ప్రతికార చర్యలకు పాల్పడవద్దని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడింది. ఆదివారం మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ట్విటర్‌ వేదికగా శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌  ఠాక్రేను ప్రజలకు ‘ఆత్మగౌరవం’  విలువను నేర్పించారని ప్రశంసిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఆత్మ గౌరవం కాపాడుకోవాలి అంటూ ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలపై శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో స్పందించింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనందుకు కేంద్ర ప్రభుత్వం రైతులపై పగ తీర్చుకుంటుందని విమర్శించింది. రైతులపై అలాంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికింది. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతు కోరటంపై ఫడ్నవిస్‌ పరోక్షంగా విమర్శించినట్టుగా అర్థం వస్తోంది. దీంతో ఆత్మగౌరవంతో వ్యాపారం చేసే 105 మంది ఎమ్మెల్యేలను కలిగిన బీజేపీ.. శివసేనకు ఆత్మగౌరవం గురించి చెప్పుతుందా? అని సామ్నాలో ప్రశ్నించింది.

బాల్‌ ఠాక్రే ఇచ్చిన ఆత్మగౌరవాన్ని శివసేన కోల్పోకుండా రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుందని పేర్కొంది. రైతులకు తక్కువ పరిహారం అంటూ ప్రశ్నించిన బీజేపీ సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ ఉద్దేశిస్తూ.. ఆత్మగౌరవం కోసం పోరాడే స్థితిలో ఉన్నారా అని విమర్శించింది. మహారాష్ట్ర్ర గవర్నర్‌ను ‘సుల్తాన్‌’ అని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సుల్తాన్‌ అనుమతించటం లేదని తెలిపింది. ‘రాజా’ నుంచి  ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయని.. కానీ తన దగ్గర నుంచి తగినంతగా స్పందన లేదని పేర్కొంది. రైతులకు హెక్టారుకు రూ. 25 వేలు ఇవ్వాలని శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌​ చేసింది. ప్రస్తుతం బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహిరిస్తోందని.. ఆ పార్టీ చర్యలు చాలా ప్రమాదకరంగా మారాయని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది.

మరిన్ని వార్తలు