‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే’

12 Dec, 2018 17:55 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో అధికార బీజేపీ మెజారిటీకి 7 స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ ఓటమితో మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన చౌహాన్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు.  హోరాహోరిగా సాగిన పోరులో చాలా కొద్ది తేడాతో తాము అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తానెవరినైనా నిరాశ పరిచి ఉంటే క్షమించాలని కోరారు.

గెలవడం, ఓడిపోవడం ఎన్నికల్లో భాగమేనని చౌహాన్‌ అన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎప్పుడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తానని వెల్లడించారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాను చూస్తు ఊరుకోనని తెలిపారు.


 

మరిన్ని వార్తలు