టీడీపీ కోట బద్దలు

13 Nov, 2018 11:43 IST|Sakshi
వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేస్తున్న సిద్ధా్దర్థ. చిత్రంలో భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్, పక్కనే మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

తంబళ్లపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీకి షాక్‌

కొండా కుటుంబం టీడీపీకి రాజీనామా

జగన్‌ సమక్షాన వైఎస్సార్‌సీపీలో చేరిక

ముఖ్యనేతల చేరికలతో పుంజుకొన్న వైఎస్సార్‌సీపీ

ఎమ్మెల్యే సొంత మండలంలో చతికిలపడిన టీడీపీ   

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలంలో అధికార టీడీపీ కంచుకోట బద్దలవుతోంది. మండల కీలక నేతలు పార్టీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరిపోతుండటంతో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.  రాజకీయంగా ఉత్కంఠ రేపిన ఈ మండలంలో టీడీపీకి ప్రతిసారి అధిక మెజార్టీ దక్కుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే  శంకర్‌ సొంత మండలం కూడా ఇదే.  నేతలు ఇస్తున్న షాక్‌లతో టీడీపీ చతికిలపడుతోంది. ఒకప్పుడు బలమైన నేతలు, కార్యకర్తలతో పటిష్టంగా ఉండేది. నేతలు, ముఖ్యకార్యకర్తలు పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతుండటం అధికార పార్టీకి ఊహించని పరిణామం.

చిత్తూరు, బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో గతంలో ఎన్నడూలేని విధంగా అసంతృప్తి బహిరంగమైంది. ఎమ్మెల్యే శంకర్‌ గెలిచిన కొంతకాలం వరకు పార్టీలో అభిప్రాయబేధాలు వ్యక్తం కాలేదు. ఏడాది తర్వాత పార్టీలో అసమ్మతి రాజుకుంది. సీనియర్లు, జూనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన వారంటూ విభజన వచ్చేసింది. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న సీనియర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎమెల్యే కూడా పట్టించుకోవడం లేదని, కనీస గుర్తింపు, ప్రాధాన్యత లేదంటూ తంబళ్లపల్లె మండల సీనియర్లుగళం విప్పారు. దీంతో∙పార్టీలో వీరి ఉనికే ప్రశ్నార్థకమైంది. మిగిలిన మండలాల్లో అసంతృప్తులున్నా నాయకులు స్పందించలేదు.  ఈ నేపథ్యంలో మడుమూడు, జుంజురపెంట, బూర్లపల్లె, పులగంటివారిపల్లెల్లో జరిగిన సంఘటనలు పార్టీ నాయకులపై పోలీసు కేసులకు దారితీసింది. అధికారంలో లేనప్పుడు కేసులు లేవు.. అధికారంలో ఉండగా కేసులతో వేధింపులా అన్న చర్చ మొదలైంది. దీని ప్రభావం ఎక్కువ గ్రామాలపైనే పడింది. దీనికితోడు పార్టీపరంగా కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రధానంగా ములకలచెరువు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టలేదని కొన్ని సామాజిక వర్గాల్లో అసంతృప్తి అధికమైంది. ఈ పరిస్థితులతో పార్టీలో కొనసాగే అవకాశాలు దూరమవుతూ వచ్చాయి. 36ఏళ్లుగా పార్టీలో ఉంటున్న నేతలంతా దూరం కావడం మొదలైంది.

వైఎస్సార్‌సీపీలో చేరికతో అలజడి..
టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరుతుండటం వారితో పాటు మండలానికి చెందిన క్రియాశీల కార్యకర్తలు ప్రతిగ్రామం నుంచి వచ్చారు. అన్ని వర్గాలకు చెందిన వారు వస్తున్నారు. ప్రధానంగా మండలంలో కీలకమైన కొండా కుటుంబానికి చెందిన కొండా గీతమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్ధార్థ, సింగిల్‌విండో చైర్మన్‌ మొరుంపల్లె భాస్కర్‌రెడ్డి, పీహెచ్‌సీ కమిటీ చైర్మన్‌ కార్యం చంద్రశేఖర్, సంపతికోట గ్రామానికి చెందిన మాజీ మండల పరిషత్‌ అధ్యక్షురాలు పోతుపేట రేణుకమ్మ, ఆమె భర్త రమణ, మాజీ సర్పంచులు శ్రీరాములు, రవీంద్రారెడ్డి, టీడీపీ ఎంపీటీసీ రమణ, బోర్‌ నారాయణరెడ్డి తదితరులు టీడీపీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరుకాక సంపతి కోట, వడ్డిపల్లె, బాగేపల్లె, కర్రేవాండ్లపల్లె తదితర పల్లెలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన కుటుంబాలు  మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి, సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనా«థరెడ్డి నేతృత్వంలో సోమవారం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. వీరి చేరికలతో  వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరింది.

బలహీనమైన టీడీపీ..
ఎమ్మెల్యే శంకర్‌ సొంత మండలంలో ఊహించని విధంగా టీడీపీ బలహీనపడింది. మండల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీని వీడారు. కొన్ని రోజుల్లో ఇంకా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామస్థాయి నాయకులు టీడీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. వీరంతా త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీన్ని గ్రహించిన నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత వెళ్లేవారి జాబితాలో ఇంకా 15మంది ఉన్నారని పార్టీ వర్గీయులతో అన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు