జీవీఎల్‌పై షూ దాడి

18 Apr, 2019 14:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అనూహ్యంగా ఆయనపైకి బూటు విసిరాడు. వేగంగా దూసుకొచ్చిన బూటు జీవీఎల్‌ ముఖం దాటి ఆయన భూజానికి తాకింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాకయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షూ విసిరిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ్‌గా గుర్తించారు. అయితే, అతను ఎందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. శక్తిభార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శక్తి భార్గవ్‌ ఓ పాత్రికేయుడని, నరేంద్ర మోదీపై అసంతృప్తితోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు