సిద్దరామయ్య భావోద్వేగం

17 May, 2018 03:58 IST|Sakshi

అభివృద్ధి పనులు చేసినా ఓటమి పాలయ్యామని ఆవేదన

సీఎం ఒంటెద్దు పోకడలే ఓటమికి కారణమని సీనియర్ల మండిపాటు

  సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం బుధవారం ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడిన ఆపద్ధర్మ సీఎం సిద్దరామయ్య(69) భావోద్వేగానికి లోనయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్లు సిద్దరామయ్య వైఖరిపై విమర్శల వర్షం కురిపించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు లింగాయత్‌ రిజర్వేషన్‌ విషయంలో సిద్దరామయ్య ఒంటెద్దు పోకడల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. మరోవైపు మాజీ హోంమంత్రి, కాంగ్రెస్‌ నేత రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం సమావేశానికి నలుగురు మినహా ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారని తెలిపారు.

గైర్హాజరైన వారందరూ పార్టీ నాయకులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. 117 ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించకుంటే తమ సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి పరేడ్‌ నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఇప్పటివరకూ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించిందని చెప్పారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేతను ఎన్నుకోలేదని స్పష్టం చేశారు. కుమారస్వామిని సీఎం చేయాలన్న లేఖపై సంతకాలు చేసి తమ మద్దతును తెలియజేశామన్నారు. పార్టీ శాసనపక్ష సమావేశానికి 73 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే హాజరైనట్లు సమాం.

మరిన్ని వార్తలు