‘దిగుమతి నేతలే దిక్కయ్యారు’

25 Apr, 2018 19:48 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను బీజేపీ ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుందని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో బీజేపీకి నాయకులే లేరని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప కేవలం డమ్మీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను ప్రచార పర్వంలో దింపడం ద్వారా రాష్ట్రంలో నాయకులు లేరని బీజేపీ అంగీకరించిందని సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. ప్రధాని వస్తూ పోతుంటారని, రాష్ట్రంలో మాత్రం తనకు, యడ్యూరప్పకు మధ్య యుద్ధం నడుస్తోందని అన్నారు.

మే 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కమలనాథులకూ తెలిసిపోయిందని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. అయితే సిద్ధూ వ్యాఖ్యలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రేఖలు గీయడం సరికాదని హితవు పలికింది. పార్టీ భాగస్వాములే తిరస్కరిస్తుండటంతో సిద్దరామయ్య నైరాశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు