కొలువుల కోసం సంతకాల సేకరణ

5 Aug, 2018 02:31 IST|Sakshi

ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికే

8 నుండి 16 వరకు సంతకాల సేకరణ

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులు భర్తీ కాక నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని, అయినా సర్కారు వారి గురించి ఆలోచించట్లేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కొలువుల కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టిందన్నారు. శనివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిందన్నా రు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జూలై 25న మండల కేంద్రాలు, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యోగ ధర్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు.

రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నా రు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతు న్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఏవిధంగా మోసం చేసిందో నిరుద్యోగులకు వివ రించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రతి మండ ల, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ఆగస్టు 8 నుండి 16 వరకు కొలువుల కోసం సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలు పునిచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. వారి పక్షాన అండగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగ గర్జనకు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆకాంక్షను బలంగా వినిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్‌రెడ్డి, మతీన్‌ ముజదుద్దీన్, బి.సంజీవరావు, బి.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు