రవీంద్ర జడేజా ఫ్యామిలీ పాలిటిక్స్
‘భర్త ఒక పార్టీలో భార్య మరో పార్టీలో ఉంటే.. రేప్పొద్దున్న ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇద్దరూ బాగుపడొచ్చు’ అన్న పాత సినిమా డైలాగు క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబానికి బాగా సరిపోతుంది. రవీంద్ర జడేజా గుజరాత్లోని జామ్నగర్ ప్రాంతానికి చెందిన వాడు. కాగా, ఆయన భార్య రివబా కిందటి నెల భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ, సోదరి నైనబా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జామ్నగర్ నియోజకవర్గంలోని కలవాడ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన హార్దిక్ పటేల్ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత మార్చి 3వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనకు రావడానికి ఒక రోజు ముందు జడేజా సతీమణి బీజేపీలో చేరారు. జామ్నగర్ సిట్టింగ్ ఎంపీ పూనంబెన్ సమక్షంలో రివబా కమలదళంలో భాగస్వాములయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పూనంబెన్ పోటీ చేస్తున్నారు.