హిందువులు హింసాత్మకంగా ఉండరా: సీతారాం ఏచూరి

3 May, 2019 09:30 IST|Sakshi

ఆరెస్సెస్‌పై సీతారాం ఏచూరి ధ్వజం

భోపాల్‌ : హిందువులు హింసాత్మకంగా ఉండరని ఎలా చెబుతారంటూ సీపీఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరెస్సెస్‌ ప్రచారక్‌లను ప్రశ్నించారు. రామాయణ, మహాభారతాల్లోని ఘట్టాలు హిందువులు కూడా హింసకు పాల్పడతారని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవుల రక్షణ కోసమంటూ ప్రైవేట్‌ ఆర్మీని పెంచి పోషిస్తున్నారంటూ ఆరెస్సెస్‌ను విమర్శించారు. ‘ రామాయణ, మహాభారతాల్లో యుద్ధాలు, హింసకు సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఆరెస్సెస్‌ ప్రచారకులై ఉండి ఈ పురాణాలను బాగానే చెబుతారు గానీ.. ఈ హింస గురించి ఎందుకు మాట్లాడారు. హిందువులు హింసాత్మకంగా వ్యవహరించరు అని ఎందుకు చెబుతారు. వేరే మతాలకు మాత్రమే హింసను ఆపాదిస్తూ.. హిందువులు అసలు అలాంటివి చేయరు అని ప్రచారం చేయడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి’ అని మండిపడ్డారు.

రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు..
సీతారాం ఏచూరితో పాటు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భోపాల్‌ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆరెస్సెస్‌, బీజేపీలకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాలరాసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతిపిత మహాత్మా గాంధీ గౌరవాన్ని కేవలం కళ్లద్దాలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఎన్ని‍కలు వ్యక్తుల మధ్య కాకుండా సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు