న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం.. వారి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందన్నారు. రైతులు రుణ భారంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచి దేశంలో ఇంతటి వ్యవసాయ సంక్షోభాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు.
మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన కిసాన్ క్రాంతి ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ర్యాలీలో దాదాపు 20వేల మంది రైతులు హరిద్వార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలుపడానికి సిద్ధం కాగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారిపైకి వాటర్ కెనాన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు.