మిస్సింగ్ పోస్ట‌ర్లు: 'స్మృతి ఇరానీ ఎక్క‌డ‌?'

2 Jun, 2020 14:21 IST|Sakshi

అమేథి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ క‌నిపించ‌డం లేదంటూ అమేథీలో మిస్సింగ్‌ పోస్ట‌ర్లు వెలిశాయి. "ఏడాది కాలంలో ఎంపీ స్మృతి ఇరానీ కేవ‌లం రెండు సార్లే అమేథీకి వ‌చ్చారు. అప్పుడు కూడా కొద్ది గంట‌లు మాత్ర‌మే ఉన్నారు. నేడు అమేథీ ప్ర‌జ‌లు క‌రోనా‌తో విల‌విల్లాడుతున్నారు. ఈ క‌ష్ట‌కాలంలో ఆమె నియోజ‌క‌వ‌ర్గ‌ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటార‌ని ఆశించాము, కానీ అది జ‌ర‌గ‌డం లేదు" అని ఆ పోస్ట‌ర్ల‌లో రాసి ఉంది. దీంతో ఎంపీ ఆచూకీ తెల‌పాల్సిందిగా కోరుతూ అఖిల భార‌త మ‌హిళా కాంగ్రెస్ ఈ పోస్ట‌ర్ల‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన స్మృతి ఇరానీ గ‌త ఎనిమిది నెలల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌దిసార్లు వెళ్లి ప‌ద్నాలుగు రోజులు అక్క‌డే ఉన్నాన‌ని తెలిపారు. (వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!)

మ‌రి సోనియా గాంధీ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన రాయ్‌బ‌రేలిలో ఎన్నిసార్లు ప‌ర్య‌టించారు? అంటూ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టివ‌ర‌కు బ‌స్సుల్లో 22,150 మంది వ‌ల‌స కార్మికులు అమేథీకి రాగా 8,322 మంది రైళ్ల ద్వారా చేరుకున్నారు. మ‌రి ఈ క‌ష్ట కాలంలో సోనియా గాంధీ త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేశారని విమ‌ర్శించారు. కాగా అమేథీలో ఇప్ప‌టివ‌ర‌కు 148 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా వుండ‌గా గ్వాలియ‌ర్‌లో జ్యోతిరాధిత్య సింధియా, భోపాల్ ఎంపీ ప్ర‌గ్యా ఠాకూర్ క‌నిపించ‌డం లేదంటూ మిస్సింగ్ పోస్ట‌ర్లు ప్ర‌త్య‌క్ష‌మైన విష‌యం తెలిసిందే. (ప్ర‌గ్యా ఠాకూర్ క‌నిపించ‌డం లేదంటూ పోస్ట‌ర్లు)

మరిన్ని వార్తలు