‘ఆకలి’పై రాహుల్‌ వర్సెస్‌ స్మృతి

15 Oct, 2017 02:44 IST|Sakshi

ట్వీటర్‌ వేదికగా మాటల యుద్ధం

న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ పనితీరు తీసికట్టుగా ఉందంటూ ఇటీవల ఓ నివేదిక విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రాన్ని విమర్శిస్తూ రాహుల్‌ చేసిన ట్వీట్‌కు స్మృతి అదే స్థాయిలో బదులిచ్చారు. తొలుత రాహుల్‌...‘ఆకలేస్తే ఓపిగ్గా ఉండండి. తిండి లేకపోతేనేం.

ఇదే విషయంపై ఢిల్లీలో చర్చ నడుస్తోంది’ అని హిందీ కవి దుష్యంత్‌ కుమార్‌ కవితను ఉటంకించారు. దీనిపై స్మృతి స్పందిస్తూ...‘అధికారమనే ఆకలితో ఉన్న మీరు ఓపిక వహించండి. సంఖ్యాబలం లేకుంటేనేం స్వార్థపరులతో కలసి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా నానా యాగీ చేస్తున్నారు’ అని ట్వీట్‌చేశారు.

బీజేపీ మహిళా వ్యతిరేకి కాదు: సుష్మ
బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అన్న ప్రతిపక్షాల విమర్శల్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తిప్పికొట్టారు. మోదీ ప్రభుత్వంలో ఆరుగురు మహిళా మంత్రులున్నారని శనివారం జరిగిన ‘మహిళా టౌన్‌హాల్‌ కార్యక్రమం’లో గుర్తుచేశారు. కీలకమైన భద్రతపై కేబినెట్‌ కమిటీలో ఇద్దరు మహిళలకు చోటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు