అమేథి, ఉత్తరప్రదేశ్ : రాహుల్ గాంధీ అమేథి రైతులకు అరటి మొక్కలు పంచారు. కానీ కేవలం అరటి చెట్లు పెంచడం వల్లే దేశంలో పేదరికం సమసిపోదు అంటూ కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో దాదాపు రూ. 77 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క కుటుంబానికే అంకితమైన పార్టీ. అలాంటి పార్టీ దేశాభివృద్ధికి, అమేథి అభివృద్ధి కోసం పని చేయదు అంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను, ప్రధాని మోదీని విమర్శిస్తారు. కానీ తిరిగి ఆర్ఎస్ఎస్ మార్గంలోనే నడుస్తూ.. అమేథి రైతులకు అరటి మొక్కలు పంచారు.
దీని గురించి నాకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అది ఏంటంటే ఈ అరటి మొక్కలను కూడా విదేశాల నుంచే తెప్పించారని విన్నాను. అంటే రాహుల్ గాంధీకి భారతదేశంలో కనీసం అరటి మొక్కలు కూడా దొరక లేదా అంటూ ఎద్దేవా చేశారు. కేవలం అరటి మొక్కలు నాటడం వల్లే దేశంలో పేదరికం తగ్గదు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని.. బీజేపీ పార్టీ కేవలం నాలుగేళ్లలోనే సాధించిందంటూ వివరించారు. రాహుల్ గాంధీ 15 ఏళ్ల నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారి కూడా ‘రోజ్గార్ మేలా’ నిర్వహించలేదని మండిపడ్డారు. కానీ బీజేపీ ప్రభుత్వం దాదాపు 7,500 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. 2022 నాటికి అమేథిలోని ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.