సోమిరెడ్డి అత్యుత్సాహం..!

14 May, 2019 18:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అత్యుత్సాహానికి పోయారు. కేబినెట్‌ మీటింగ్‌పై ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరోసారి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయాలను, సీఎం ఆదేశాలను ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించారు. కోటి 40 లక్షల రూపాయల పరిహారం రైతులకు ఇవ్వాలని, తాగునీటి విషయంలో ఆర్థిక ఇబ్బందులను చూసుకోవద్దని సీఎం సూచించినట్టు తెలిపారు. కేంద్ర నుంచి రావాల్సిన నరేగా (జాతీయ ఉపాధి హామీ పథకం) నిదులపై అధికారులతో మాట్లాడాని సీఎం ఆదేశించినట్టు చెప్పారు.

ఫొని తుపాన్‌ వల్ల వ్యవసాయానికి 3 కోట్ల 39 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని, ఉద్యానవన పంటలకు 2 కోట్ల 95 లక్షల రూపాయలు నష్ట పరిహారంగా ఇవ్వాలని అంచనా కట్టినట్టు వెల్లడించారు. అధికారులతో మాకెప్పుడూ సమస్య లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మంత్రులు మీడియాతో సమీక్షల వివరాలు చెప్పకూడదనే ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. ఇటీవలే సచివాలయం ఆరుబయట సోమిరెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించిన సంగతి తెలిసిందే. ‘పొని’ తుపానుపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం ప్రెస్‌ మీట్‌ పెట్టారు.

మరిన్ని వార్తలు