‘అవినీతికి అద్దం పట్టే పార్టీ టీడీపీ’

27 Oct, 2018 13:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అవినీతికి అద్దం పట్టే పార్టీ టీడీపీ అని సొంతమామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గుర్తుచేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్‌ బాధితు ల మద్దతు ధర్నాలో మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్దాల ఉగ్గుపాలు తాగి పెరిగాడని విమర్శించారు. పొట్ట విప్పితే అవినీతి, అబద్దాలు అంటూ చంద్రబాబుపై మండిపడుతూ.. 2019లో అగ్రిగోల్డ్‌ బాధితుల శాపం తగులుతుందన్నారు. ఆస్తి విలువ పెరుగుతున్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవ్వాల్సిన బకాయిల విలువ ఎలా తగ్గుతుందంటూ నిలదీశారు.

గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేస్తే.. ఎలా ఫోన్‌ చేస్తారని మండిపడటం చూస్తే.. చంద్రబాబుకు బ్యాలెన్స్‌ తప్పినట్టు కనిపిస్తోందని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకునే విషయంలో చంద్రబాబు బ్యాలెన్స్‌ తప్పడని ఎద్దేవా చేశారు. ప్రధాని సొంతింటి కలను .. చంద్రబాబు అద్దింటి కలగా మార్చేశాడంటూ మండిపడ్డారు. ఏపీలో డిపాజిట్లు పోయే పార్టీగా, సింగిల్‌ డిజిట్‌ పార్టీగా చంద్రబాబును అంతమొందించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశభక్తిని ప్రేరేపించే పార్టీ భాజపా పార్టీ అంటూ పేర్కొన్నారు. శివాజీ హీరో కాదని.. జీరో అంటూ ఆయన మాటలను నమ్మే దుస్థితికి చంద్రబాబు చేరాడంటూ ఘాటు విమర్శలు చేశారు. 

మరిన్ని వార్తలు