‘అప్పటి నుంచే చం‍ద్రబాబు మోదీపై కక్ష గట్టాడు’

13 Feb, 2019 12:41 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : మార్చి ఒకటిన విశాఖలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవుతారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. దీనికంటే ముందు ఈ నెల 19న ఒంగోలులో, 21న రాజమండ్రిలో అమిత​ షా సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రధానికి స్వాగతం చెప్పని బాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఏపీకీ మోదీ ప్రభుత్వం ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు.

మోదీని తిట్టడానికి చంద్రబాబు ఇప్పటికే రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం మోదీ నర్మదా నది నుంచి నీళ్లు, మట్టి తెస్తే చంద్రబాబు ఆనందంగా స్వీకరించలేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద భోజనాల కాంట్రాక్టర్‌ ఇరిగేషన్‌ మంత్రి బంధువుదేనని తెలిపారు. బీజేపీ మండలానికో సబ్‌ స్టేషన్‌ కట్టిస్తే.. టీడీపీ ఉద్యోగాలు అమ్ముకుంటోందని ఆరోపించారు. గోద్రా సంఘటన నుంచే చం‍ద్రబాబు మోదీపై కక్ష గట్టారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు