బాబుకు ఆవగింజంత సంబంధం లేదు

14 Jul, 2018 10:25 IST|Sakshi

పోలవరం గురించి బాబు అసలు పట్టించుకోలేదు

పోర్టు ఇచ్చినా భూములు ఇవ్వలేని స్థితిలో టీడీపీ ఉంది

బీజేపీ సీనియర్‌ నేత సోము వీర్రాజు

సాక్షి, విశాఖపట్నం : పోలవరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆవగింజంత సంబంధం లేదని బీజేపీ సీనియర్‌ నేత సోము వీర్రాజు విమర్శించారు. శనివారం మీడియతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుందని, కానీ టీడీపీ దీక్షలు చూసి కాదని అన్నారు. పోర్ట్ సమావేశంలో ఎక్కడా ప్రధాని మోదీ ఫొటో పెట్టలేదని, అందుకే బీజేపీ కార్యకర్తలు మోదీ అంటూ నినాదాలు చేశారని చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తుంటే ప్రధానికి వ్యతిరేకంగా చంద్రబాబు అధికారిక కార్యక్రమంలో కూడా మాట్లాడుతుంటారని విమర్శించారు.

తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా కూడా చంద్రబాబు పోలవరం గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును చేయలేననే పుష్కరణి, తాటిపూడి ఎత్తిపోతల పథకం అమలు చేశారని ఆరోపించారు. విభజనకు ముందు తెలంగాణా గురించి మాట్లాడేటప్పుడు పోలవరం గురించి మొదట మాట్లాడింది బీజేపీయేనని అన్నారు. ముంపు గ్రామాలను బీజేపీ ఏపీలో కలిపిందని, కానీ చంద్రబాబు మాత్రం తాను చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం పోర్ట్ ఇచ్చినా ఇంకా భూములు ఇవ్వనిలేని స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

మరిన్ని వార్తలు