తల్లి తరఫున ప్రచారంలో బాలీవుడ్‌ నటి

3 May, 2019 18:13 IST|Sakshi

లక్నో ప్రచారంలో పాల్గొన్న నటి సోనాక్షి సిన్హా

లక్నో: బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా  ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో లోక్‌సభ స్థానంలో సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున తన తల్లి పూనమ్‌ సిన్హా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పూనమ్‌ సిన్హా విజయాన్ని కోరుతూ.. శుక్రవారం లక్నో వీదుల్లో నిర్వహించిన ర్యాలీలో సోనాక్షి సిన్హా పాల్గొన్నారు.  యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి, కన్నౌజ్‌ ఎంపీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌తో కలిసి సోనాక్షి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. పూనమ్‌తో పాటు సోనాక్షి, డింపుల్‌ రావడంతో వారిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ప్రతిష్టాత్మక లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పూనమ్‌, బీజేపీ నుంచి కేంద్రమంత్రి, సిటింగ్‌ ఎంపీ రాజ్‌నాథ్‌ సింగ్‌ పోటీ పడుతుండగా, కాంగ్రెస్‌ నుంచి గురు ఆచార్య ప్రమోద్‌ కిృష్ణణ్‌ను బరిలో నిలిచిన విషయం తెలిసిందే.  మాజీ  ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రాతినిథ్యం వహించిన లక్నోలో 1991 నుంచి ఇప్పటి వరకు బీజేపీ మినహా మరేపార్టీ విజయం సాధించలేదు. 1991 నుంచి 2009 వరకు వాజ్‌పేయీ ఇక్కడ విజయం సాధించగా.. 2014లో రాజ్‌నాథ్‌ సింగ్‌ గెలుపొందారు. ఎస్పీ, బీఎస్పీ కూటగా పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ఎన్నిక ఉత్కంఠంగా మారింది. కాగా సోనాక్షి తండ్రి శత్రుష్ను సిహ్హా బిహార్‌లోని పట్నాసాహెబ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు