-
కన్నడ రాజకీయాల్లో నటీనటులు
వచ్చినంత వేగంగా నిష్క్రమణం
వెండితెరపై అలవోకగా సాహసకృత్యాలను పండించే నటీనటులు నిజజీవిత రాజకీయాల్లోను, ఎన్నికల్లోను కూడా అదే హవా కొనసాగించాలని రావడం, వారిలో కొందరంటే కొందరే ప్రజామోదం పొందడం జరుగుతోంది. ఎక్కువమంది నటీనటులు పెద్ద ప్రభావం చూపకుండానే రాజకీయాలను చాలించుకోవడం విశేషం.
సాక్షి, బెంగళూరు: ఎన్నికలు వస్తే చాలు రాష్ట్ర రాజకీయా ల్లో సినీ స్టార్లు తళుక్కున మెరుస్తుండడం సహజం. కానీ అలా రాజకీయాల్లోకి మెరుపులా వచ్చి మాయమవుతున్నవారే అధికంగా ఉన్నారు. బహుభాషా నటుడు ప్రకాశ్రాజ్ కొన్ని నెలలుగా బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శల యుద్ధం ప్రారంభించి తాజాగా బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో కూడా ఇక్కడ పలువురు ఐటీ, పారిశ్రామిక ప్రముఖులు పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేక చాలా మందిలా మళ్లీ సినిమాలకు వెళ్లిపోతారా? అని కొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
ఊరించిన ఉపేంద్ర
ఇక శాండల్వుడ్లో విలక్షణ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లో రియల్స్టార్లా సత్తా చూపలేకపోతున్నారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) ద్వారా లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరిలో ఎక్కువమంది పెద్దగా ఊరూపేరు లేనివారే. దీంతో ఎన్నికలపై ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పాలి.
మండ్యలో వార్
ఇక ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం మండ్య నియోజకవర్గమనే చెప్పాలి. రెబెల్స్టార్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడం, ఆమెకు బీజేపీ మద్దతిస్తుండడం సంచలనంగా మారింది. ఆమె పోటీదారు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కూడా వర్ధమాన హీరోనే. ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు.