రాజకీయ తీవ్రవాదిగా మారిన కేసీఆర్‌

24 Apr, 2019 03:30 IST|Sakshi

క్విడ్‌ప్రోకో కిందఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలి 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ రాజకీయ తీవ్రవాదిలా మారారని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీ య ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆయన స్వయం గా రాజకీయ తీవ్రవాదిగా మారారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. అనంతరం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు.

క్విడ్‌ప్రోకో కింద సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లోకి వస్తే భూములు రెగ్యులరైజ్‌ చేస్తామని, ప్రాజె క్టులు, కాంట్రాక్టులు కట్టబెడతామని, ఆర్థిక సహ కారం అందిస్తామని హామీలిస్తూ ఎమ్మెల్యేలు పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఊరికే వదిలేది లేదని, వారిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. ఇందు కోసం రెండు, మూడు రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడతామని, ఈ కార్యక్రమాన్ని పినపాక నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.  

వారిపై చర్యలు తీసుకోవాలి.. 
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసి ఫిర్యాదు చేసినట్లు భట్టి వెల్లడించారు. గతంలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని, ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, లింగయ్య, సురేందర్‌లపై చర్యలు తీసుకుని వారి శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉన్నందున వెంటనే స్పీకర్‌ ఇందుకు ఉపక్రమించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆలిండియా కిసాన్‌ సెల్‌ వైస్‌చైర్మన్‌ కోదండరెడ్డి, ప్రభుత్వ మాజీ విప్‌ అనిల్, తెలంగాణ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు