జగన్‌ వల్లే హోదా సజీవంగా ఉంది: భూమన

2 Aug, 2018 14:27 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి

తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన పోరాటాల వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో గురువారం భూమన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన సభలలో తాను ఏం చేశాడో చెప్పుకోలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్‌ జగన్‌ మీద ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా సభలో వైఎస్‌ జగన్‌ మీద దుర్మార్గంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబూ ఎన్ని ప్రాజెక్టులు కట్టావో సమాధానం చెప్పాలి..రాజశేఖర్‌ రెడ్డి దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ వీరోచిత పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాపుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో తొక్కింది చంద్రబాబేనని అన్నారు. తుని ఘటనకు చంద్రబాబే కారణమని, ఆయన మనుషులే హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.

బాబు పాలన మీద, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన మీద చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే చర్చకు సిద్ధపడాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు భూమన సవాల్‌ విసిరారు. సోనియా గాంధీతో కలిసి వైఎస్‌ జగన్‌ మీద తప్పుడు కేసులు పెట్టించింది నువ్వు(చంద్రబాబు) కాదా అని సూటిగా అడిగారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు తిరుమల ప్రసాదంలా భావించాడని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు