‘దమ్ముంటే ఏపీలో సీపీఎస్‌ రద్దు చేయండి’

18 Sep, 2018 04:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దమ్ము ఉంటే సీపీఎస్‌ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేయాలని మహబూబ్‌నగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీది అక్కడొక నీతి ఇక్కడొక నీతి అని విమర్శించారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు ప్రతిపక్ష పార్టీల నాయకులను నిలదీయాలని సోమవారం పిలుపునిచ్చారు. సీపీఎస్‌ను రాష్ట్రం రద్దు చేసుకోవచ్చని ప్రధాని ప్రకటిస్తే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వెంటనే రద్దు చేసి చూపుతామన్నారు.

వింత పోక డలు, విచిత్ర సమాధానాలు విడనాడాలని ఆయన టీడీపీకి సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు రద్దు చేయడంలేదని ప్రశ్నించారు. త్రిపుర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో మాత్రం పాత పింఛను విధానం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అనుకుంటే సీపీఎస్‌ రద్దు పెద్ద విషయం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన, సీపీఎస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టిన పార్టీలే పాత విధానం కావాలని కొత్త గళం అందుకోవడం విడ్డూరమన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ సీపీఎస్‌పై పార్లమెంట్‌లో బిల్లు పెడితే మా ఎంపీలు మద్దతు ఇస్తారన్నారు. పీఆర్సీ విషయంలో సర్కారు ఉద్యోగులకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు