2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పు 

24 Sep, 2019 02:09 IST|Sakshi

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పెట్టిన అంచనాలను పూర్తి స్థాయి బడ్జెట్‌కు వచ్చేసరికి రూ.36 వేల కోట్ల మేర కుదించిన ఘటన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక మాంద్యం పేరుతో కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునేందుకే బడ్జెట్‌ అంచనాలను తగ్గించారని, వాస్తవానికి అప్పులు తెస్తేనే కానీ గండం గడవని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పారు.

అప్పులు తెస్తేనే కానీ ఉద్యోగులకు జీతాలిచ్చి, సంక్షేమ పథకాలను కొనసాగించలేని ప్రమాదస్థితి ఏర్పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2023 నాటికి రాష్ట్రం అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. కేసీఆర్‌ తెస్తున్న అప్పుతో సంపద సృష్టించబడాలి కానీ పాలకుల ప్రయోజనాలకే సరిపోతోందన్నారు. రానున్న మూడేళ్లలో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి ఎంత మొత్తానికి చేరుకుంటున్నదన్న దానిపై ఆయన పవర్‌పాయిం ట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రజలు, మేధావుల్లో చర్చ జరగాలని, అందుకే అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజెంటేషన్‌ ఇస్తానని తెలిపారు.

>
మరిన్ని వార్తలు