గాంధీ హత్యకేసుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

16 Feb, 2020 17:00 IST|Sakshi

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్‌ స్వామి ట్విటర్‌ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని  ఆయన కోరారు. గాంధీజీ హత్యపై సుబ్రమణియన్‌ స్వామి ట్విట్టర్‌లో వరుస ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే కాల్చిన  రివాల్వర్‌‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందుకే కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
('కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు')

మరో ట్వీట్‌లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ..  ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు. ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా సుబ్రమణియన్‌ స్వామి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం)

కాగా, గతంలోనూ గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపించాయి. 2017 అక్టోబర్‌లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్‌ను కాల్చాడా లేదా అన్న దానిపై కొంత అస్పష్టత ఉన్నందున.. ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసులో గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని.. దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని తెలిపారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.

మరిన్ని వార్తలు