నల్గొండ : రైతుల రుణమాఫీ చేయకపోవడంతో రైతుల ఫై రుణభారం పెరిగి రైతు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. సీపీఎం రాష్ట్ర సభ ఆదివారం నల్గొండలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం మతఘర్షణలు ఎక్కువయ్యాయని, మతోన్మాదం ఎక్కువై ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ దేశ ప్రజలను భ్రమలకీ గురి చేస్తూ, హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి వాటి ద్వారా ఓటు బ్యాంకు సంపాదించాలనుకుంటున్నానడని ఆరోపించారు.
సీపీఎం సీనియర్ నేత రాఘవులు మాట్లాడుతూ..గత 4 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్రలోని దళితులపై బీజేపీ దాడులకు పాల్పడుతుందని, చిన్న పిల్లల ఫై అఘాయిత్యాలకు పాల్పడుతూ,ఎంతో చారిత్రక కట్టడమైన తాజ్మహల్ మన నిర్మాణం కాదంటూ అవమాన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.